EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గోవింద నామాలను పేరడీ చేయడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

ఈతరం భారతం అమరావతి ఆగస్ట్ 10

రాజకీయ లబ్ధి కోసం దైవ నామాలను, భక్తి గీతాలను పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నామాలను కించపరిచేలా వ్యవహరించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి నీచమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరు నగరంలో ఇటీవల జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి సంబంధించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు, తమ కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైన గోవింద నామాలను పేరడీ రూపంలో వాడుకోవడం భక్తుల మనసులను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. ఆ వేడుకల్లో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలను కించపరిచేలా, సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక అపహాస్యం మాత్రమే కాదని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రపూరిత ఆలోచన అని ఆయన అభివర్ణించారు.

ధార్మిక విశ్వాసాలు, దైవారాధనతో ముడిపడిన అంశాలను చులకన చేసే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సాంప్రదాయాలను, భక్తుల నమ్మకాలను కడుపుమంటతో దెబ్బతీయాలని చూసే సంస్కృతిని ఎక్కడికక్కడ నిలువరించాలని స్పష్టం చేశారు. మతపరమైన సున్నితమైన అంశాలను రాజకీయ విమర్శలకు వాడుకోవడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా భవిష్యత్తులో ఎవరూ కూడా దైవ నామాలను, మంత్రాలను, పవిత్ర స్తోత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం అపహాస్యం చేయవద్దని ఆయన హితవు పలికారు. భక్తికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన పవిత్రమైన విషయాలను ప్రతి ఒక్కరూ గౌరవించడం సామాజిక బాధ్యత అని ఆయన సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Related News

Select the Topic
Scroll to Top