EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో విలయతాండవం.. కంపించిన మూడు దేశాలు

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఆగస్ట్ 10

బొగోటా: లాటిన్ అమెరికా దేశాలు సోమవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూమి పొరల్లో చోటుచేసుకున్న తీవ్ర కదలికలతో కొలంబియా దేశం భయంకరంగా వణికిపోయింది. భారీ భూకంపం ధాటికి రాజధాని బొగోటాలో ఇళ్లు, కార్యాలయాలు, భారీ భవనాలు సైతం అటూఇటూ ఊగిపోయాయి. దీంతో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రకంపనలు కేవలం కొలంబియాకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఈక్వెడార్, పనామా దేశాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. దీంతో మూడు దేశాల్లోనూ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. భూకంపం సమయంలో భవనాలు కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు

కొలంబియా రాజధాని బొగోటాలో సోమవారం ఉదయం అనూహ్యంగా నేల కంపించింది. చూస్తుండగానే భవనాలు ఊగిపోవడంతో ఏ క్షణాన ఏదైనా భవనం కూలిపోతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా చాలామంది భవనాల నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లోకి చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు కొనసాగుతాయేమోనన్న ఆందోళనతో చాలామంది ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు

ఈ భూకంప తీవ్రతపై వివిధ భూగర్భ శాస్త్ర పరిశోధనా సంస్థలు వేర్వేరు అంచనాలను వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) 7.4 తీవ్రతగా నమోదు చేసినట్లు సమాచారం. అయితే కొలంబియా స్థానిక జియోలాజికల్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను 6.6గా పేర్కొంది. జర్మనీకి చెందిన GFZ సంస్థ 6.8 తీవ్రతగా అంచనా వేసింది.

పశ్చిమ కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 79 నుంచి 100 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నిపుణుల అంచనాలు వెల్లడించాయి. లోతైన భూకంపం కావడంతో ప్రకంపనలు విస్తృత ప్రాంతానికి వ్యాపించినట్లు తెలుస్తోంది.కొలంబియాతో పాటు ఈక్వెడార్, పనామాలోనూ ప్రకంపనలు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భూకంపం కారణంగా ఎక్కడైనా భారీ నష్టం జరిగిందా? ప్రాణనష్టం సంభవించిందా? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భూకంపం అనంతరం వచ్చే ఆఫ్టర్‌షాక్‌లపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే ఉదయం వేళ సంభవించిన ఈ భారీ ప్రకంపనలు మూడు దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.

Related News

Select the Topic
Scroll to Top