ఈతరం భారతం తిరుమల జూన్ 25 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. గురువారం ఆయన తిరుమలలోని ల్యాబ్ను సందర్శించి, తొలి అనాలిసిస్ రిపోర్ట్ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించిన ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్లో కేవలం రెండున్నర నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) మేరకు పరీక్షలు నిర్వహించి తొలి రిపోర్ట్ సిద్ధం చేయడం విశేషమన్నారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్లో 50కి పైగా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని తెలిపారు. 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ల్యాబ్ టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని చెప్పారు. త్వరలో ప్రభుత్వ అనుమతి మేరకు 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు చెప్పారు.ప్రతిరోజూ తిరుమలలోని వివిధ వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్లు, హోటళ్లు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, మార్కెటింగ్ విభాగంలోని ముడి సరుకుల నుంచి సుమారు 40 ఆహార నమూనాలు, అలాగే జలప్రసాదం, వాటర్ లైన్ల నుంచి 20 నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఇంతకుముందు నీటి నమూనాల పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు పంపించాల్సి వచ్చేదని, ప్రస్తుతం తిరుమలలోనే ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్ ద్వారా వేగవంతంగా, ఖచ్చితమైన ఫలితాలు పొందుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ల్యాబ్ క్వాలిటీ మేనేజర్ శ్రీ లక్ష్మీనారాయణ, ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.















