ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 15 శనివారం:
బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉపాధి వ్యవస్థల్లోని లోపాలే యువత ఆందోళనలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూ దశలో 90 శాతం వరకు అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కులం, మతం వంటి అంశాల ఆధారంగా కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. పేపర్ లీకులు, నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టి వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని.. లేదంటే దేశంలో మరిన్ని యువత ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో పెరుగుతున్న నిరసనలపై యోగా గురువు బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉపాధి రంగాల్లోని లోపాలే ఆందోళనలకు తీవ్ర కారణం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి యోగపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్దేవ్ మాట్లాడారు.
ఝార్ఖండ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డెక్కడం వెనుక విద్యా వ్యవస్థలోని సమస్యలు ఉన్నాయని రామ్దేవ్ చెప్పారు. అనేక స్కూళ్లు, కాలేజీలు ఉపాధ్యాయులు, పుస్తకాలు, విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్న రామ్దేవ్.. ఈ దశలో అవినీతికి అవకాశం ఉంటోందని ఆరోపించారు. కులం, సామాజిక వర్గం, మతం, భావజాలం ఆధారంగా కొంతమంది వ్యక్తులు.. అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అర్హత ఉన్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు వంటి అంశాలు కూడా యువతలో తీవ్ర ఆగ్రహాన్ని పెంచుతున్నాయని రామ్దేవ్ బాబా పేర్కొన్నారు. ప్రజాగ్రహం మరింత పెరిగి పెద్దఎత్తున ఉద్యమాలకు దారితీయకముందే.. విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం, అధికారులు సీరియస్గా తీసుకోవాలని రామ్దేవ్ హెచ్చరించారు. ఇప్పటికీ సమయం ఉందని.. వ్యవస్థను సంస్కరించకపోతే దేశంలో మరిన్ని ఉద్యమాలు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.















