EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం

ఈతరం భారతం న్యూ డిల్లి మే 25 :

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో కూడా ఇదే అంశం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిందని, అప్పట్లో కోర్టు సూచనల మేరకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలయ్యాయా లేదా అన్న విషయంపై ఎన్టీఏ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గురువారం లోపు ఆ నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “ఇది బాధాకరం. గత ఘటనల నుంచి వారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. ఈ అంశం ఇప్పటికే కోర్టు ముందుకు వచ్చింది. అప్పట్లో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పలు సూచనలు చేసింది. ఇప్పుడు ఆ సూచనల అమలుపై స్పష్టత కావాలి” అని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా), యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (యూడీఎఫ్) సహా పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా జరుగుతున్న లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని పిటిషనర్లు వాదించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని లేదా దాని స్థానంలో స్వతంత్ర, పారదర్శక సంస్థను ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. అయితే లీక్ ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతో మే 12న పరీక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టులో కీలక వాదనలు వినిపించారు. ఇప్పటికే 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న లీక్ ఘటనలు విద్యార్థుల ప్రాథమిక హక్కులపై నేరుగా దాడి చేసినట్లేనని వాదించారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. ఇంకా, మళ్లీ నిర్వహించే పరీక్షలను ఒక హైపవర్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ఆ కమిటీలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాలని, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలను సభ్యులుగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా, గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి మాజీ ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ కమిటీ సూచనల అమలుపై కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. “కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు పరిస్థితిని తెలియజేస్తూ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్‌గా కె. రాధాకృష్ణన్ నివేదిక సమర్పించాలి” అని పేర్కొంది. నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత అంశాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాస్తుంటారు. ఇలాంటి కీలక పరీక్షల్లో వరుసగా లీక్ ఆరోపణలు రావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.

Related News

Select the Topic
Scroll to Top