EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గుట్కా, పాన్‌ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మి వేసినవారి ఫొటోలను తీసి న్యూస్‌ పేపర్లలో వేయాలి.

03.10.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల

దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నాగ్‌పూర్‌ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా, పాన్‌ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మి వేసినవారి ఫొటోలను తీసి న్యూస్‌ పేపర్లలో ప్రచురించాలని అన్నారు. దేశంలో చాక్లెట్‌ కవర్‌ను రోడ్లపైనే విసిరేసే జనం.. విదేశాలకు వెళ్లినప్పుడు వాటి మాత్రం జేబుల్లోనే పెట్టుకుని చక్కగా ప్రవర్తిస్తారని వ్యాఖ్యానించారు. తనకు చాక్లెట్‌ తిన్నాక కవర్‌ను కారులోంచి బయట విసిరే అలవాటు గతంలో ఉండేదని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం చాక్లెట్‌ తింటే ఆ కవర్‌ను జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్లాక చెత్తబుట్టలో వేస్తున్నానని తెలిపారు.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేళ.. పరిశుభ్రత పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మన దేశంలో ప్రజలు చాలా తెలివైనవారు.. చాక్లెట్లు తిన్నాక కవర్‌ను వెంటనే పారేస్తారు. అయితే, అదే వ్యక్తులు విదేశాలకు వెళ్తే చాక్లెట్‌ తిన్న తర్వాత ఆ కవర్‌ను జేబులో ఉంచుకుంటారు.. విదేశాల్లో మాత్రం చక్కగా ప్రవర్తిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత కేవలం ఇళ్లలోనే కాదని, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత పాటించాల్సిన అవసరాన్ని గడ్కరీ గుర్తు చేశారు. ‘గుట్కా, పాన్‌‌లు నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసేవారి ఫొటోలను పత్రికల్లో ప్రచురించాలి… వ్యర్థాలను సంపదగా మార్చుకోవాలి’ అని సూచించారు. వ్యర్థాలను బయో ప్రొడక్ట్‌లుగా మార్చే పలు అంశాలను ప్రజలకు వివరించారు.

మరోవైపు, ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి చీపురు పట్టి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శతాబ్దంలో విజయవంతమైన అతి పెద్ద ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం మారిందని మోదీ పేర్కొన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని, ఇటువంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదని, ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గమని చెప్పారు. స్వచ్ఛతకు సంబంధించిన రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమమైనట్టు తెలిపారు. మిషన్‌ అమృత్‌ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. నమామి గంగ, వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ గోవర్ధన్‌ ప్లాంట్ల వంటి పనులు స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నాయని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top