ఈతరం భారతం హైద్రాబాద్ జులై 5 :
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. గత నెలలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదన్నారు. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించాలని సీఎం కోరారు. షరతులు, విధివిధానాలు వెంటనే ఖరారు చేయాలన్నారు. మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ అనుమతులు జాప్యం అవుతున్నాయని, వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి లేఖల్లో కోరారు.
ఇటీవలే కేంద్రమంత్రులతో భేటీ అయిన సీఎం : మెట్రో రైలు పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే పలుమార్లు లేఖలు రాశారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొద్దిరోజుల క్రితమే దిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మెట్రో రైలు విస్తరణను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహాయం అవసరమని సీఎం వివరించినట్టు సమాచారం. మెట్రో విస్తరణకు నోచుకోకపోవడంతో హైదరాబాద్లో నగరంలో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. విస్తరణకు సంబంధించిన అన్ని ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పిన సీఎం, దీనికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రావాల్సిన రుణాన్ని త్వరగా విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు.















