ఈతరం భారతం హైదరాబాద్ జూలై 6
హైదరాబాద్ నగరానికి తలమానికమైన హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఓ నిర్మాణాన్ని చేపడుతోందని ఫిర్యాదులు రావడంతో సోమవారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని బృందం నిర్మాణ స్థలాన్ని సంయుక్తంగా తనిఖీ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని నీటిపారుదల శాఖ స్పష్టం చేయడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ నగరానికి చారిత్రక, పర్యావరణ వారసత్వంగా ఉన్న హుస్సేన్ సాగర్ను సంరక్షించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.















