ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 8
దేశంలో 2025-26 యాసంగి(రబీ) సీజన్లో వరి సాగుతోపాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రణాళికశాఖ నివేదికలో తెలిపింది. తమిళనాడులో 30.76, ఏపీలో 17.29 లక్షల ఎకరాల్లో సాగైంది. దేశంలో మొత్తం యాసంగి వరి సాగు విస్తీర్ణంలో సగానికిపైగా తెలంగాణలోనే ఉంది. రబీ, ఖరీఫ్ రెండు సీజన్లను కలిపి చూస్తే మాత్రం అత్యధిక సాగు విస్తీర్ణంలో ఉత్తర్ప్రదేశ్ తొలి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు శనివారం నాటికి 72.30 లక్షల టన్నులకు చేరాయి. మరో వారంపాటు కొనుగోళ్లు జరగనుండటంతో ఈ సంఖ్య 75 లక్షల టన్నులు దాటే అవకాశాలున్నాయి. తమిళనాడు, ఏపీ కలిపి ధాన్యం కొనుగోళ్లు 40 లక్షల టన్నులలోపే ఉన్నాయి. వానాకాలం(ఖరీఫ్)తో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరతే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సన్నాలకు బోనస్, రైతుభరోసా పథకాలు అమలు చేస్తుండటంతోపాటు ధాన్యం కొనుగోళ్లు చేపడుతుండటంతో మిగతా రాష్ట్రాల కంటే వరి సాగు, దిగుబడి అధికంగా ఉంటోంది. ఖరీఫ్లో 69.90 లక్షల ఎకరాల్లో, 59.90 లక్షల ఎకరాల్లో కలిపి మొత్తం 129.80 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు సీజన్లు కలిపి సుమారు 282 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి.















