ఈతరం భారతం హైదరాబాద్, జులై 9:
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున వరుసగా రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆకస్మికంగా భూమి కంపించడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తొలి భూకంపం రాత్రి 1:37 గంటలకు సంభవించగా, రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అనంతరం సుమారు రెండు గంటల తర్వాత, ఉదయం 3:23 గంటలకు మరోసారి భూమి కంపించింది. రెండో ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదైంది.ఈ భూకంపానికి హింగోలి సమీపంలోని 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం ప్రాంతం కేంద్రంగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.భూప్రకంపనల తీవ్రత పెద్దగా లేకపోయినా, ఇళ్లలోని పాత్రలు కింద పడిపోవడం, గోడ గడియారాలు, కిటికీలు, తలుపులు ఊగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మహిళలు, చిన్నారులు సహా స్థానికులు భయంతో ఇళ్లను విడిచి బయటకు వచ్చి కొంతసేపు రోడ్లపైనే గడిపారు.















