ఈతరం భారతం హైదరాబాద్ జూలై 20
నీట్-యూజీ 2026 పరీక్షల నిర్వహణలో వెలుగుచూసిన అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీలు ఝుళిపించడం, బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ పోరాటంలో నష్టపోయిన విద్యార్థులందరికీ తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని అధికార పీఠంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షల లీకేజీలతో లక్షలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తమ తప్పులను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. నిరసనకారులపై పడిన ప్రతి దెబ్బ.. నిజమన్నా, ప్రశ్నలన్నా బీజేపీకి ఎంత భయమో తెలియజేస్తోందని, నీట్ కుంభకోణంపై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.















