ఈతరంభారతం ఖమ్మం సత్తుపల్లి ఆగస్టు 207 గురువారం
ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం శ్రమించే జర్నలిస్టులు నేడు వారి సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి పాదయాత్ర చేయటం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బిఆర్ఎస్, జనసేన, సిఐటియు ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన పాదయాత్ర గురువారం సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రానికి చేరుకుంది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖదీర్ శ్రీనివాస్ రెడ్డిలు పూలమాలవేసి నివాళులర్పించారు. మండల కేంద్రానికి చేరుకున్న జర్నలిస్టుల పాదయాత్రకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున శాలువాలతో సత్కరించి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. మండల కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అధికారికి వినతి పత్రం అందజేసి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాజకీయ పార్టీలు నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ… గత బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని బహిరంగంగా హామీలిచ్చి మూడు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందే తప్ప వారి హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ స్పందించకపోతే జర్నలిస్టులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇళ్ల స్థలాలు సాధిస్తామని అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్ట రాగమయి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.















