ఈతరం భారతం ఖమ్మం/ మధిర, జూలై – 27
మధిర లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా అల్పాహార కార్యక్రమం భవిష్యత్ లో దిగ్విజయంగా ముందుకు సాగాలని జరిపించిన నృసింహ మహా యాగంలో పాల్గొన్న అనంతరం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
విద్యార్థులకు అల్పాహారంతో పాటుగా అందించే మిల్క్ యూనిట్ ను ప్రారంభించారు. అల్పాహారం తయారు చేసే యంత్రాలను, కూరగాయలాంజ్ శుద్దిచేసే మెషీనరీని, ఇతర అన్ని రకాల ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అల్పాహారం చేశారు. ఇడ్లి, పొంగల్, ఉప్మా, పూరీ, రాగి ఇడ్లి, ఇతర వంటకాలను ఆయన రుచి చూసారు. అల్పాహారం సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యార్థులకు ఇడ్లిలు, ఇతర వంటకాలను వడ్డించారు.
భట్టి విక్రమార్క వడ్డించే సమయంలో ఆయనతో మాట్లాడేందుకు, చేయిని కలిపేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని చూపారు. అనంతరం వివిధ పాఠశాలలకు అల్పాహారాన్ని అందించే వాహనాలను ఉప ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
సభ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విద్యార్థులంతా ముక్తకంఠంతో పాడడంతో సభ వాతావరణం ఉద్వేగంగా.. ఉత్సాహంగా మారింది. వేదిక మీదున్న ఉప ముఖ్యమంత్రి చిన్నారుల ఉత్సహాన్ని ప్రత్యేకంగా అభినందించారు.















