నాగర్ కర్నూల్, ఏప్రిల్ 1 (ఈతరం భారతం ప్రతినిధి ):నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల సందర్భంగా డా. రాత్లావత్ కృష్ణ రచించిన పీహెచ్ డి పరిశోధనా గ్రంథం “Empowering Women Entrepreneurs: The MSME Journey in Telangana” ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పుస్తకావిష్కరణ జరిపారు . గ్రంథ రచయిత డా. రాత్లావత్ కృష్ణ ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకులు పరిశోధకులుగా ఎంతో పేరు పొందారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్.డి పూర్తి చేసి యుజిసి- నెట్, ఏపీ -సెట్, టీఎస్- సెట్ వంటి అర్హతలు సాధించారు. మహిళా వ్యవస్థాపకత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక అసమానతలపై ఆయన జరిపిన పరిశోధనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో డాక్టర్ కృష్ణ రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. మహిళా సాధికారత ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా సామాజిక మార్పుకు కూడా కీలకమని ఈ పరిశోధన గ్రంథం స్పష్టం చేసింది. ఫీల్డ్ డేటా, కేస్ స్టడీస్ ఆధారంగా రూపొందిన ఈ పరిశోధనలో మహిళా వ్యాపారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఆర్థిక సహాయం లోపం, మార్కెట్ అవకాశాల కొరత, శిక్షణ లోపం వివరంగా చర్చించబడ్డాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న WE-Hub, స్త్రీ నిధి వంటి పథకాల ప్రాముఖ్యతను కూడా ఈ గ్రంథం విశదీకరించింది. వ్యాపారం ప్రారంభించిన తర్వాత మహిళల ఆదాయం, జీవన స్థాయి గణనీయంగా మెరుగుపడుతున్నట్లు ఈ పరిశోధన గ్రంథం ద్వారా రుజువైంది. MSME రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఉపాధి అవకాశాలు, ఎగుమతుల్లో దాని ప్రాధాన్యతను గణాంకాలతో ఈ గ్రంథంలోని పరిశోధన వివరించింది.

ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, కళాశాల ప్రిన్సిపాల్ రచయిత డాక్టర్ కృష్ణ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పరిశోధనా గ్రంథం విద్యార్థులు, పరిశోధకులు, పరిపాలక నిర్ణేతలకు ఎంతో ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని రచయిత డాక్టర్ కృష్ణ ను అభినందించారు.














