ఈతరం భారతం పెద్దపల్లి, జూన్ 16
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని, దాని అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డిఅధికారులనుఆదేశించారు.మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో జిల్లా అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జే. అరుణశ్రీ, కొప్పుల వెంకటరెడ్డి, డీసీపీ రాంరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్-3 ద్వారాకల్పించబడిందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు ఆర్టీఐ దరఖాస్తులపై ఎలాంటి ఫీజు ఉండదని చెప్పారు. సమాచారాన్ని అందించేందుకు అయ్యే ఖర్చు వివరాలను ప్రజా సమాచార అధికారులు ముందుగానే దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు.చట్టం ప్రకారం 30 రోజుల్లోపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో సమాచారం అందకపోతే సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసే హక్కు దరఖాస్తుదారునికి ఉందని తెలిపారు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగితే పరిహారం కోరే అవకాశం కూడా చట్టంలోఉందనివివరించారు.ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో అవసరమైతే మూడో పక్ష సమాచారాన్ని కూడా వెల్లడించవచ్చని ఆయన స్పష్టం చేశారు.ప్రతికార్యాలయంలో ప్రజా సమాచార అధికారి (పీఐఓ), మొదటి అప్పీలేట్ అథారిటీ, రెండో అప్పీలేట్ అథారిటీ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు.ఆర్టీఐ చట్టంలోని సెక్షన్-2లో నిర్వచనాలు, సెక్షన్-3లో సమాచార హక్కు, సెక్షన్-4లో స్వచ్ఛంద సమాచార ప్రకటన, సెక్షన్-5లో పీఐఓల నియామకం, సెక్షన్-6లో దరఖాస్తు విధానం, సెక్షన్-7లో సమాచారాన్ని అందించే విధానం, సెక్షన్-8లో మినహాయింపు సమాచారం, సెక్షన్-9లో కాపీరైట్ పరిరక్షణ, సెక్షన్-10లో సమాచార విభజన, సెక్షన్-11లో మూడో పక్ష సమాచారం, సెక్షన్-18లో ఫిర్యాదుల విచారణ, సెక్షన్-19లో అప్పీలు, సెక్షన్-20లో జరిమానాలు, సెక్షన్-22లో చట్టానికి ప్రాధాన్యం, సెక్షన్-24లో మినహాయింపు పొందిన సంస్థలు, సెక్షన్-25లో వార్షిక నివేదిక, సెక్షన్-26లో అవగాహన కార్యక్రమాలు, సెక్షన్-27, 28లలో నియమాల రూపకల్పన వంటి అంశాలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని. ప్రతి అధికారి ఆర్టీఐ చట్టంలోని అన్ని నిబంధనలను పూర్తిగా తెలుసుకుని, అందిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, సమాచార హక్కు చట్టాన్ని అత్యున్నత ప్రాధాన్యతతో అమలు చేయాలని ప్రధాన సమాచార కమిషనర్ స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్టీఐ చట్టం అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 570 మందికి పైగా ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీలు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు చట్టంపై మరింత అవగాహన పెంపొందించుకుని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు గంగయ్య, సురేష్, జిల్లా స్థాయి అధికారులు,వివిధ శాఖల ప్రజా సమాచార అధికారులు,మొదటి అప్పీలేట్ అథారిటీలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















