ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు 31:బీహార్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబా మోదీపై రాహుల్ గాంధీ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి మయూరి సెంటర్ వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్ చేరుకున్నారు. నిరసన ర్యాలీలో రాహుల్ గాంధీ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జడ్పీ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దేశానికి అందించిన నాయకత్వం ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే, వారి తల్లిని రాహుల్ గాంధీ అవమానించడం క్షమించరాని నేరం అని అన్నారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి బీహార్ ఎన్నికల సభలో, ఇండియా కూటమి అనే అవినీతి కూటమి వేదికపై నిలబడి ప్రధానమంత్రి తల్లిని, వృద్ధురాలైన హీరాబా మోదీ ని, తల్లి అనే పవిత్ర పదాన్ని అవమానించేలా మాట్లాడాడు. ఒక వ్యక్తిని విమర్శించడం రాజకీయాల్లో సాధారణమే. కానీ ఒక తల్లిని అవమానించడం అంటే దేశంలోని ప్రతి తల్లిని అవమానించడం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం మోదీ కుటుంబంపై దాడి కాదు. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలపై దాడి అని అన్నారు.
ఈరోజు రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చిన ఆ దుర్వాక్యం కేవలం మోదీగారిని బాధ పెట్టలేదు. ఈ దేశంలోని ప్రతి ఒక్క తల్లి గుండెలను గాయపరిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంస్కారం లేదు, గౌరవం లేదు, భారతీయ విలువలు తెలియవు. వారికీ తెలిసింది కేవలం కుట్ర రాజకీయాలు, కుటుంబ పరంపరా రాజకీయాలు మాత్రమే. ఇదే కారణంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మట్టికరిపోతోంది. దేశ ప్రజలు వారిని ఒక్కొక్క రాష్ట్రం నుండి తిరస్కరిస్తున్నారనీ తెలియజేశారు. ఈ రోజు మనం ఖమ్మం వీధుల్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం వెనుక ఒకే సందేశం ఉంది – “భారతీయ సంస్కృతిని అవమానిస్తే మేము ఊరుకోము.” బీజేపీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో అదే మాట చెబుతున్నారన్నారు. నిరసన ర్యాలీతో నగరంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జడ్పీ సెంటర్ వద్ద బిజెపి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. బిజెపి నాయకులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో పోలీసులు అప్రమత్తమై బీజేపీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అరెస్టుల అనంతరం కూడా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్,గెంటెల విద్యాసాగర్,మందడపు సుబ్బారావు,అల్లిక అంజయ్య,గుత్తా వెంకటేశ్వర్లు,సుదర్శన్ మిశ్రా,దొడ్డ అరుణ,పమ్మి అనిత,అత్తి విజయ రెడ్డి,దార్ల మల్లీశ్వరి,గడీల నరేష్ ,గుత్తా వంశీ,మేకల నాగేందర్ ,నల్లగట్టు ప్రవీణ్ కుమార్, రేఖా సత్యనారాయణ,వీరవెల్లి రాజేష్, మహేందర్ సింగ్, సుబ్బు భూక్యా వెంకటేష్, శ్రీరామనేని మనీ, తమ్మెర రజినీ రెడ్డి, కన్నెకంటి కృష్ణచారి,రీగన్ ప్రతాప్,రుద్ర గాని మాధవ్ , జ్యోతుల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.















