ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 4 : భవన నిర్మాణ అసంఘటిత కార్మికులకు ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే ఎక్స్ గ్రేషియాను 6 నుంచి రూ. 10 లక్షలకు, సహజ మరణాలకు 2 లక్షల రూపాయలకు పెంచుతూ లేబర్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తమ అవిశ్రాంత పోరాటాల ఫలితం అని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం వెల్లడించారు. లేబర్ కమిషన్ నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ ఇందిరా నగర్ సెంటర్ లో వందలాది మంది భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో రత్నం పాల్గొని ప్రసంగించారు. అలాగే ప్రతి భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలని, అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలనే డిమాండ్లపై పోరాడాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ఆదేశాల మేరకు తాము చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలోని కార్మికులు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఈ స్ఫూర్తితో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయనున్నామని జేఎస్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజ గణేష్ పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం తాము అనేక రకాల పోరాటాలు చేస్తూనే వాటి అవగాహన కోసం జేఎస్టీయూసీ జెండా పండుగ కార్యక్రమాలు చేపట్టామని జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మంతపురం శ్రీను ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు స్వామి దాసు, జేఎస్టీయూసీ రాష్ట్ర నాయకుడు జయరాజ్ తో పాటు అనేక మంది భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.















