ఈ తరం భారతం ఖమ్మం, సెప్టెంబర్ – 6:ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మంత్రివర్యులు, శనివారం ధంసలాపురం వద్ద ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి పరిశీలించారు. మంత్రి, అధికారులకు, ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని అన్నారు. 160 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తి కావడం వల్ల గంటన్నర సమయంలో రాజమండ్రి వెళ్ళవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇక్కడి వారికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్స్ ఆలస్యం కావడం వల్ల ఆలస్యం జరిగిందని అన్నారు. ధంసలాపురం ఆరోఓబి నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్.ఓ.బి. నిర్మాణానికి సంబంధించి హై టెన్షన్ విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ వంటి అన్ని పనులు పూర్తి చేశామని, నవంబర్ నాటికి ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని అన్నారు. కొత్త సంవత్సరంలో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రావాలని అన్నారు. రైల్వే శాఖను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓబీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైల్వే, కెనాల్, మున్నేరు పై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వేస్తే రైతాంగానికి ఉపయోగ పడుతుందని, దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా వ్యవసాయ ప్రాంతం అధికంగా ఉందని, నాగార్జున్ సాగర్ కాల్వ క్రింద ఆయకట్టు ఉన్నందున 365 రోజుల పాటు హార్వెస్టర్ రాకపోకలు ఉంటాయని, రహదారి వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. వర్షాలు తగ్గిన నేపథ్యంలో మున్నేరు బ్రిడ్జ్ తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. 3500 కోట్లతో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి చిన్న, చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, నేషనల్ హైవే పిడి దివ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.















