ఈతరంభారతం సెప్టెంబర్ 12 టిజిఎస్ఆర్టీసీ – ఖమ్మం రీజియన్:
టిజిఎస్ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా వినూత్నమైన సేవా కార్యక్రమం “యాత్రాదానం” ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా, అలాగే ఖమ్మం రీజియన్లో కూడా అమల్లోకి వస్తోంది.వ్యక్తుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభదినాలు వంటి ఆనందదాయకమైన సందర్భాల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహోన్నత సేవలో భాగస్వాములవ్వదలచిన వారు వారి యొక్క సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చు, తాము కోరుకునే శుభదినాన టిజిఎస్ఆర్టీసీ కి విరాళం అందజేసి, ఆ విరాళం ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల ద్వారా విహారయాత్రలను ఏర్పాటు చేయించుకోవచ్చు.
తాము జరుపుకునే శుభదినాన తగిన మొత్తాన్ని సంస్థకు విరాళంగా అందజేయడం ద్వారా వారికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తుంది. యాత్రదానం కార్యక్రమ నిర్వహణ కోసం పేరుతో ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసింది. వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు స్పాన్సర్ చేసి.. అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు. ఈ యాత్రాదాన కార్యక్రమాన్ని వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వినియోగించుకోచ్చు. యాత్రాదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేస్తూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది.
దాతలు చెల్లించే విరాళం మేరకు కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను విహారయాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్థానిక డిపో మేనేజర్లను (ఖమ్మం, మధిర, సతుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం & మణుగూరు) మరియు అధికారులను సంప్రదించి “యాత్రాదానం” కింద బస్సులను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెల్ప్లైన్ నంబర్లు 040-69440000 / 040-23450033 లకు కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే, సంబంధిత అధికారులు తిరిగి సంప్రదించి పూర్తి వివరాలను తెలియజేస్తారు.
ఈ సందర్భంగా టీ జి ఎస్ ఆర్ టి సి ఖమ్మం రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ సరి రామ్ మాట్లాడుతూ “సంస్థ సామాజిక బాధ్యతతో పాటు సాంస్కృతిక విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు జీవితంలో మరపురాని అనుభూతిని కలిగించవచ్చని విశ్వసిస్తున్నాం. కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా, ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు, అసోసియేషన్లు, ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి “యాత్రాదానం” కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది సమష్టిగా కృషి చేస్తారని ఖమ్మం రీజియన్ తరపున తెలియజేస్తున్నాం” అని చెప్పారు















