ఇతర భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 26 : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ఎన్ గోపి సతీమణి, ప్రముఖ తెలుగు కవయిత్రి ఎన్ అరుణ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో మృతి చెందారు. మౌనమూ మాట్లాడుతుంది, పాటల చెట్టు, గుప్పెడు గింజలు, అమ్మ ఒక మనిషి అన్న నాలుగు కవితా సంపుటులను అరుణ రచించారు. వర్తమాన ప్రపంచ జీవన పరిణామాన్ని అలతి పదాలతో కవితలుగా రచించి పాఠకుల ఆదరాభిమానాల్ని ఆమె పొందారు. ఎన్నో సాహిత్య కార్యక్రమాలలో కవయిత్రిగా, సాహితీవేత్తగా ఆమె పాల్గొన్నారు. అరుణ రచించిన ఎన్నో కవితలకు మంచి స్పందన దక్కింది. అరుణ మృతి పట్ల పలువురు కవులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సాహిత్యాభిమానులు, కవయిత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మానవీయ విలువలతో తమ సాహిత్యాన్ని వెలయించిన అరుణ మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని వారు నివాళులర్పించారు. అరుణ అంతిమ సంస్కారక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.















