హైదరాబాద్ (యాదగిరిగుట్ట), అక్టోబర్ 14 (ఈతరం భారతం);: పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాస గృహంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా గంధ మల్ల ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి విజయవంతం చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కూడా ఆయన నాయకులకు సూచించారు. రాబోయే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభ్యర్థులను గెలిపించాలని , కాంగ్రెస్ విజయ డంకా మోగించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
సీఎం సూచన కీలకం
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు, కార్యకర్తలు తమ తమ రాజకీయ అవసరాలు , వ్యక్తిగత అవసరాల కోసం ఇతర పార్టీల్లో చేరుతుంటారు. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా వస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రజా పాలన కొనసాగిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అనేకమంది పార్టీ టికెట్లు ఆశిస్తుంటారు. ఈ సందర్భంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించడం అనేది రాజకీయ పార్టీలలో సర్వసాధారణం. కాగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ కోసం కృషిచేసిన వారిని తప్పకుండా గుర్తించి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తోంది. అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జెండా మోసిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తల్లో అభిప్రాయం వెల్లడి అవుతుంది. ముఖ్యమంత్రి సూచనతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తొనికిసలాడుతోంది.















