ఈతరం భారతం అక్టోబర్ 15 :యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎవరెస్ట్ హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి విజయ్ కుమార్, కొలనుపాక ప్రతిభ హై స్కూల్ కరస్పాండెంట్ గాదే సోమిరెడ్డి బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రపంచ స్థాయి గుర్తింపును పొందిన సంస్థ లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- 2025 ను అందుకున్నారు.
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డి, లీడ్ ఇండియా ఫౌండర్ ప్రొఫెసర్ నల్లబోయిన సుదర్శన్ ఆచార్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి చేతుల మీదుగా విజయ్ కుమార్, సోమిరెడ్డి ఈ అవార్డులను స్వీకరించారు. నాలుగు దశాబ్దాలుగా విద్యా సంస్థలను నిర్వహిస్తూ అందిస్తున్న విశిష్ట విద్యా సేవలకు గాను ఈ లీడ్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్రస్థాయి అవార్డును వారిద్దరికీ అందజేసి ఘనంగా సన్మానించారు. లీడ్ ఇండియా అవార్డు అందుకున్న వారిని పలువురు స్థానికులు అభినందించారు.















