ఈతరం భారతం ఖమ్మం అక్టోబర్ 15 :రాంగ్ రూట్లో వస్తున్న మొరం టిప్పర్ ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు స్పాట్లో డెడ్ అవ్వగా, మరో ఇద్దరైనటువంటి నాలుగు సంవత్సరాల బాలుడుతో పాటు, మూడు నెలల పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక బాలుడు మృతి చెందగా చికిత్స పొందుతూ మూడు నెలల పిల్లాడు కూడా మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి 44వ హైవే పై చోటుచేసుకుంది.
గ్రామంలోని చత్రపతి శివాజీ స్టాచ్యూ నుంచి కామారెడ్డి వైపు రాంగ్ రూట్లో వెళుతున్న మొరం టిప్పర్ భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వస్తున్న అదిలాబాద్కు చెందిన కిషన్(54) తండ్రి, ఖమ్మంకు చెందిన ఆయన కూతురు జెస్లిన్ (28) స్పాట్లో డెడ్ అవ్వగా నాలుగు సంవత్సరాల మనవడు, మూడు నెలల వయసు గల చంటి పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే జిఎంఆర్ అంబులెన్స్లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందగా, మూడు నెలల పసి గుడ్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
పసి పిల్లాడికి టీకావేయించేందుకు వస్తూ..
మూడు నెలల పిల్లాడికి వేయించాల్సిన టీకా వేయించేందుకు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ నుంచి తెలిసిన సిస్టర్ ఉందన్న ఉద్దేశంతో జంగంపల్లి పల్లె దవాఖానకు ఎలక్ట్రిక్ స్కూటీ పై వస్తున్నారు. రెండు నిమిషాలు అయితే ఆసుపత్రికి చేరుకునే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ వారి ప్రాణాలను హరించింది.















