ఈతరం భారతం/ హైదరాబాద్ /నవంబర్ 11:
తెలంగాణ రాష్ట్ర గీతం”జయ జయహే తెలంగాణ” రచయిత అందెశ్రీ ఇకలేరు
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు . సోమవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.అందెశ్రీ గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని ఆయనను చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై అందెశ్రీ గేయరచన చేసారు. అందెశ్రీ అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట.
2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం అందెశ్రీ మాటలు కూడా రాసారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు.















