ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 23 ;
సర్-2026 (ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)జాబితాలో మీ పేరు ఉండాలంటే ఎన్యుమరేషన్ ఫారం తప్పకుండా నింపాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఏళ్లుగా ఓటేస్తున్నామంటే అలా కుదరదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి హైదరబాద్ మహానగరంలో ఓటరు పత్రాల పంపిణీ మొదలవుతుందని, జులై 24న ముగుస్తుందని తెలిపారు. నెలరోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఎన్యుమరేషన్ పత్రాలు నింపినవారి వివరాలతో మాత్రమే ముసాయిదా ఓటరు జాబితా తయారవుతుంది. ముసాయిదాలోని ఓట్లపై నెల రోజుల పాటు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తామన్న ఆయన ఆయా ఓటర్లకు నోటీసులు ఇస్తామని చెప్పారు. ఓటరు తగు పత్రాలను అందజేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
గుర్తింపు కార్డుల అవసరం లేదు
అక్టోబరు 1, 2026న తుది ఓటరుజాబితా ముద్రిస్తామని, ముసాయిదా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను కూడా ప్రకటిస్తామన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్ ఇంటికి వచ్చిన సమయానికి తాళం వేసి ఉంటే తలుపు, కిటికీల నుంచి పత్రాలను లోపలికి వేస్తారని పేర్కొన్నారు. వాటిలో వివరాలు నింపి సిద్ధంగా ఉంచుకోవాలన్న ఆయన మరో రోజు బీఎల్వో వచ్చి పత్రాలను తీసుకుంటారని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలతో ఎలాంటి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం లేదు.
జాబితాలో పేరు లేకుంటే?
ఎన్యుమరేషన్ పత్రాన్ని అధికారులు ఇవ్వరు. వారు ఓటరుగా నమోదయ్యేందుకు ఎప్పటిలాగే ఫారం-6 నింపాల్సి ఉంటుంది. వారికి సర్-2026 సర్వేతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇటీవల ఎన్నికల్లో ఓటు వేసిన నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఇల్లు మారిన ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ పత్రం ఇచ్చేది ఉండదు. ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డులోని అడ్రస్లోనే సదరు వ్యక్తులు ఎన్యుమరేషన్ ఫారం అందుకోవాలి. ఆ చిరునామాతోనే వివరాలను నింపి ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఇంగ్లీష్లో ముద్రించిన ఎన్యుమరేషన్ పత్రాన్ని పంపిణీ చేస్తున్నారు.
ఓటరు సంతకం చేయాలి
ఎన్యుమరేషన్ పత్రంలో నింపిన వివరాలు సరైనవని తెలుపుతూ ఓటరు లేదా ఓటరు కుటుంబ సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందిని బీఎల్వోలుగా నియమించారు.వారు ప్రతి పత్రాన్ని పరిశీలించి అందులోని వివరాలను బీఎల్వో యాప్లో నమోదు చేస్తారన్న ఆయన బీఎల్వో అప్లోడ్ చేసే వివరాలను సహాయ ఈఆర్వో, ఈఆర్వోలు ఆమోదిస్తారు. వారికి ఏ మాత్రం అనుమానం వచ్చినా సదరు ఓటరుకు నోటీసు వెళ్తుందని. అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అవసరమైన పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.















