ఈతరం భారతం ముంబై, జూన్ 24:
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కుండపోత వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముంబైతో పాటు థానే, పుణే ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సియాన్ సబ్వే పూర్తిగా నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక అండర్బ్రిడ్జిలు నీటితో నిండిపోగా, కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాలకు చెట్లు నేలకూలడం, వాహనాలు నిలిచిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబై నగరంలో సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.














