ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 18:
___________________________________
22-ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ట్రాక్లో పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీఓఆర్టీ నెం.564 జారీ చేసింది. సీసీఎల్ఏ డీఎస్ లోకేష్కుమార్ చైర్మన్గా, లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్గాంధీ హనుమంతు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీఓ 118 ప్రకారం 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్కు సంబంధించిన మెమోను ప్రభుత్వం జారీ చేసిందని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. దశాబ్దాలుగా ప్లాట్లు తీసుకుని ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారు నిబంధనల ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు.
సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కోసం గతంలో జారీ చేసిన జీఓ 76ను అనుసరించి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అనుమతులతో లేఅవుట్లు వేసి, రెవెన్యూ రికార్డుల్లో 22-ఏలో ఉన్న ప్రాంతాలను జాబితా నుంచి తొలగించే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన 10–12 అంశాలపై నెల రోజుల్లో నిర్ణయాలు తీసుకుని 22-ఏ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.















