ఈతరం భారతం తిరుపతి ఆగస్టు 05 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
తిరుపతి నగర ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా, అలాగే వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి , తిరుపతి మున్సిపల్ కమిషనర్ శారద దేవి , జలవనరులశాఖ అధికారులతో కలిసి కపిలతీర్థం, మాల్వాడి గుండం, ఎన్జీవో కాలనీ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో చేపట్టిన “City of Tanks” ప్రణాళికలో భాగంగా తిరుమల ఏడుకొండల నుంచి ప్రవహించే సహజ సిద్ధ జలధారలైన కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటిని సమర్థవంతంగా నిల్వ చేసి,వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నీటి సేకరణ ప్రక్రియ కోసం మున్సిపల్ కార్పొరేషన్ మరియు జలవనరుల శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపామన్నారు. తిరుపతి నగరంలోకి ఎంత తీవ్రమైన వరద వచ్చినా సమర్థవంతంగా తట్టుకునేలా వరద మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛమైన వర్షపు నీరు నగరంలోని మురుగు నీటి కాలువల్లో కలవకుండా అడ్డుకట్ట వేసి,కాలువలు,తూములు, ఆక్రమణలను తొలగించి, వర్షాకాలంలో నగరంలో వరదలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కపిలతీర్థం నుండి పారే నీటిని మురుగు కాలువల వైపు మళ్లించకుండా, NGO కాలనీ పార్క్ మధ్యలో భూగర్భ జల నిధి పెంపునకు (Water Recharge Point – Aquifer) ప్రణాళిక రూపొందించామని,దాదాపు 200 మీటర్ల మేర భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ రీఛార్జ్ పాయింట్ల లో అవసరమైన బోర్ల ఏర్పాటుతో పాటు, ఎలక్ట్రిక్ నీటి ప్రవాహ వ్యవస్థను, రెండు ఫిల్టరింగ్ ట్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో దాదాపు 5 కిలోమీటర్ల పరిధి వరకు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి. అటవీశాఖ పరిధిలోని 3 కుంటలను (పాండ్స్) మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ఎంతవరకు అభివృద్ధి చేయవచ్చు, గరిష్టంగా ఎంత నీటిని నిల్వ చేయవచ్చో పరిశీలించామన్నారు. కపిలతీర్థం నుండి వచ్చే నీటిని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసి,అక్కడ నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్టర్ స్టేషన్, ఫిల్టర్ బెడ్లు నిర్మించి, పరిశుభ్రమైన తాగునీటిని నగర ప్రజల అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు.
తిరుపతి స్థానిక జనాభా (5-6 లక్షలు)తో పాటు రోజువారీగా వచ్చే 1 నుండి 1.5 లక్షల మంది భక్తుల నీటి అవసరాలను తీర్చడం. భక్తులు ఎక్కువగా తిరుపతి లోనే బస చేసి తిరుమలకు వెళ్తారు కాబట్టి మున్సిపాలిటీ ద్వారా నీటి కొరత లేకుండా చూసే ప్రణాళిక రూపొందించామని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడం మరియు నగరాన్ని సుందరీకరించడం,వ్యర్థ నీరు చెరువుల్లో కలవకుండా ప్రతి చెరువు వద్ద ‘సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్’ (STP) నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య,జనవనరులశాఖ ఎస్ ఈ పి వి ప్రసాద్, హెల్త్ఆఫీసర్ యువఅన్వేష్ రెడ్డి,తుడా, మున్సిపల్, జనవనరుల శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.















