ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 6
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కర్ణాటక నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమై జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సుమారు 2.23 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత దృష్ట్యా 29 గేట్లను ఎత్తి దాదాపు 2.24 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా నీటి విడుదలలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.















