ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 3
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ 3 దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ ఈ పర్యటన చేయనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట ఇండోనేషియాను సందర్శిస్తారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతారు. అక్కడ ఆయన ప్రధాన అధికారిక కార్యక్రమాలు మెల్బోర్న్లో జరుగుతాయి. అనంతరం న్యూజిలాండ్కు వెళ్లి తన పర్యటనను ముగిస్తారని ఎంఈఏ కార్యదర్శి (ఈస్ట్) రుద్రేంద్ర టాండన్ తెలిపారు.ప్రధాని మోదీ న్యూజిలాండ్ పర్యటన ఎంతో ప్రత్యేకమైనది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాన మంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వచ్చేవారం ప్రధాని మోదీ న్యూజిలాండ్లో తన మొదటి అధికారిక పర్యటన చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. “భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో తన మొదటి అధికారిక పర్యటన చేయనున్నారని ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను” అని లక్సన్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు















