ఈతరం భారతం హైద్రాబాద్ జులై 3 :
పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ‘ది పార్క్’ హోటల్లో గురువారం జరిగిన “నీటి భద్రత – పారిశ్రామిక స్థిరత్వం” ఉన్నత స్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, నీటి భద్రత లేకపోతే శాశ్వత పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రతి పారిశ్రామిక పార్కులోనూ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని, అధునాతన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత (CSR) నిధులను స్థానిక చెరువుల పునరుద్ధరణకు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతుల మెరుగుదలకు కేటాయించాలని ఆమె పిలుపునిచ్చారు.
భూగర్భ జలాలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో పరిశ్రమలు ఐఓటీ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి స్మార్ట్ సాంకేతికతను ఉపయోగించుకుని నీటి వృధాను, లీకేజీలను అరికట్టాలని సదస్సులో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని పారిశ్రామిక నీటి నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.















