ఇతర భారతం న్యూఢిల్లీ జూన్ 11
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల అభివృద్ధికి ‘ఎం-6 టాస్క్ఫోర్స్’ ఏర్పాటు చేసి రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, ఐఐఎం, సెమీకండక్టర్ పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు నాణ్యమైన విద్య, వైద్యం కీలకమని పేర్కొంటూ యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, విద్యా సంస్కరణలను వివరించారు.
దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా మెట్రో నగరాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా.. తాజాగా ఆ ప్రతిపాదనలను.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచారు.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల అభివృద్ధి కోసం.. ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు.ఈ 6 మెట్రో నగరాల అభివృద్ధి కోసం రూ. 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ 6 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోట్ల చొప్పున నిధులు అందించాలని కోరారు. దేశ అభివృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంపై ఈ సందర్భంగా తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. కుల గణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను ఈ సమావేశంలో వివరించారు.















