ఈతరం భారతం హైదరాబాద్ జూలై 17 :
దేశం నలుమూలల సాహిత్యాభిమానులకు సుపరిచితుడైన ప్రముఖ జాతీయ కవి, రచయిత, బహుభాషావేత్త, ‘మై గిఫ్ట్’ స్వచ్ఛంద సంస్థ రూప శిల్పి డా. పెరుక రాజు రచించిన 13వ సాహితీ సంకలనం “సాగు” (భారతీయ భాషల అనువాద కథల సంకలనం)ను తెలంగాణ ప్రభుత్వ సైనిక్ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాలు నేడు హైదరాబాద్లోని తన కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాలు మాట్లాడుతూ, ఒకే భాషలో కాకుండా పలు భారతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం సాధారణ విషయం కాదని అన్నారు. దేశ రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, మరోవైపు సాహిత్య సృజనలోనూ విశేష కృషి చేయడం డా. పెరుక రాజు విశిష్టతకు నిదర్శనమని కొనియాడారు.
“సైన్యంలో కొనసాగడం గన్నుతో పెట్టిన విద్య, సాహితీ సాగు చేయడం పెన్నుతో పెట్టిన విద్య. ఈ రెండూ డా. రాజుకు వెన్నతో పెట్టిన విద్యలు” అని ప్రశంసించారు. సమాజానికి మార్గదర్శకంగా నిలిచే ఇటువంటి విలువైన రచనలు మరెన్నో అందించాలని ఆకాంక్షించారు.
భారతమాత గర్వించే తెలంగాణ ముద్దుబిడ్డ డా. పెరుక రాజు ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ అధికారి గా విధులు నిర్వర్తిస్తున్నారు. జాతీయ కవిగా, రచయితగా, బహుభాషావేత్తగా తెలుగు సహా పలు భారతీయ భాషల మధ్య సాహిత్య, సాంస్కృతిక వారధిగా నిలుస్తూ జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందారు.
సాహిత్యంతో పాటు సామాజిక సేవలోనూ ఆయన విశేష కృషి చేస్తున్నారు. పేద, అణగారిన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకొని స్థాపించిన “మై గిఫ్ట్” స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “ప్రోత్సహించడమే నిజమైన బహుమతి” అనే జీవిత తత్వంతో సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సాగు సంపుటి కీ ముందు మాట ప్రముఖ అనువాద వేత్త డా నలిమెల భాస్కర్ రాశారు. ఈ సంపుటి లో వివిధ భాషల అన్నీ పన్నెండు కథలు అందరినీ ఆలోచిoప చేసేవిగా వున్నవి.
ఈ కార్యక్రమంలో ఆర్మీ సైనికుడు పానగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.
డా. పెరుక రాజు ఇప్పటివరకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సత్కారాలు అందుకొని జాతీయ సాహిత్య రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలిచే “సాగు” గ్రంథం పాఠకాదరణ పొందడంతో పాటు భారతీయ భాషల మధ్య సాహిత్య అనుసంధానానికి మరింత దోహదపడుతుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాలు వ్యక్తం చేశారు.















