హైదరాబాద్ సెప్టెంబర్ 3 (ఈతరం భారతం );: తాను ఎప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెంట ఉంటాను కానీ.. ఎవరి వెనక ఉండాల్సిన అవసరం తనకు లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి సభ్యత్వం నుంచి, ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేసిన తర్వాత కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్రావు, సంతోష్ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె అన్నారు. ఈ మాటలపై సిఎం తాజాగా స్పందించారు.ఒకప్పుడు ఏ పార్టీనైతే శాసనసభలో అడుగుపెట్టనివ్వమని విర్రవీగారో.. ఇప్పుడు వాళ్లే గొడవ పడుతున్నారని సిఎం అన్నారు. ఒకరిపై ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు ఊరికే పోవు అని పేర్కొన్నారు. ‘హరీశ్రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒకరంటే.. కవిత వెనకాల రేవంత్ ఉన్నాడని మరొకరు అంటున్నారు. ఇప్పటికే తెలంగాన ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అలాంటప్పుడు ఎవరు మీ వెనుక ఎందుకు ఉంటారు. నేను ఉండేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెంట. వాళ్ల కోసం పని చేస్తా. కానీ, మీ వెనకు ఉండే సమయం నాకు లేదు. మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు’’ అని సిఎం స్పష్టం చేశారు.















