ఈతన భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 30 : మరికొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. అక్టోబర్ ఒకటిన బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. 3న పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. తెలంగాణలో మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.















