ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 13
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది.ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శనివారం మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ నష్టం చేకూరుస్తున్న వారిపై ఆయన ఘాటుగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. దీని వెనుక అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికే అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రంగంలోకి దిగారని, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి ప్రమేయం ఉందనే విషయాలపై ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కోవర్టులు, లీకుల వీరుల ఆట కట్టిస్తాం..
పార్టీ అంతర్గత సమాచారాన్ని, వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుస్తున్న కోవర్టులు ఎవరో గుర్తించే పనిలో నాయకత్వం నిమగ్నమైందని ఆయన పేర్కొన్నారు. “ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో.. గ్రీకు వీరులు ఎవరో త్వరలోనే అందరికీ బయటపడుతుంది” అంటూ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నామినేషన్ తిరస్కరణకు కారణమైన బాధ్యులపై, పార్టీకి నమ్మకద్రోహం చేసిన కోవర్టులపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.















