హైదరాబాద్ సెప్టెంబర్ 13 (ఈతరంభారతం );మైదానాలు నిరంతరం క్రీడా కార్యక్రమాలతో కళకళలాడే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చొరవ తీసుకుంటుందని తెలంగాణ స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఈరోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి ఆసియన్ టైక్వాండో ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ, భారత దేశంలో పుట్టిన అనేక ప్రాచీన క్రీడల నుండి ఏర్పడే మార్షల్ ఆర్ట్స్ క్రీడలని, ఆసియా దేశాల్లో మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ కు అత్యంత ఆదరణ ఉందని అన్నారు. సెల్ ఫోన్, లాప్ టాప్లతో సామాజిక మాధ్యమాల ఓరవడిలో కొట్టుకుపోతున్న విద్యార్థులు యువత డ్రగ్స్ గంజాయి కి బానిసలుగా మారుతున్న నేపథ్యంలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ వారిలో యువతలో ఆత్మరక్షణకే కాకుండా ఆత్మవిశ్వాసము పెంపొందింప చేస్తాయని అన్నారు. ఆతిధ్యానికి మారుపేరైన హైదరాబాద్ నగరంలో జాతీయ అంతర్జాతీయ పోటీలు నిర్వహించే సంస్థలకు తెలంగాణ క్రీడా శాఖ అవసరమైన మద్దతు తెలుపుతుందని అన్నారు. ఒక స్పష్టమైన సమగ్రమైన నూతన క్రీడ విధానాన్ని ప్రకటించి దాని పటిష్టంగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు క్రీడల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో ఆసియా కు చెందిన 8 దేశాల నుండి దాదాపు 1,000 మంది టైక్వాండో క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమికల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వీణా వాహిని, ఇంటర్నేషనల్ టైక్వాండో మాస్టర్ జయంత్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు రవికుమార్, ప్రేమ్ గౌడ్ నరేష్, చందు, ఖాన్ సాహెబ్, ప్రేమ్ కుమార్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.















