ఈతరంభారతం/హైదరాబాద్/ అక్టోబర్ 22 :
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటల్లోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.సీఎం రేవంత్ ఆదేశాలతో తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆకస్మిక, తక్షణ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు.రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు
.















