ఈతరం భారతం 09.09.2025 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం..లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కక్షిదారులకు సూచించారు. రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్లో ఇరు వర్గాల కక్షిదారులు పరస్పర అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాజీపడదగిన క్రిమినల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన,ఆర్థిక లావాదేవీలు, కుటుంబపరమైన సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసుల్లో కక్షిదారులు రాజీపడే అవకాశం వుందని అన్నారు. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీపడేలా అవగాహన కల్పించాలని సూచించారు.















