హైదరాబాద్ సెప్టెంబర్ 24 (ఈతరం భారతం );ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంకై రూ 525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది. అయితే ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగుప్రతి ఏటా వర్షాకాలంలో ఉదృతంగా పొంగి, పరిసర ప్రాంతాల ఇండ్లు, వర్తక , వ్యాపార సంస్థలు, పంటలు వరద ముంపు కి గురవుతున్నాయి. మారిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వస్తున్న ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ లతో ప్రభుత్వ మౌళిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. పనులకు వెళ్ళిన వారు, ఇంటికి వచ్చి సామాన్లు, నిత్యావసరాలు సర్దుకునే వెసులుబాటు లభించదు. దీనితో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు ,విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతు లు, పైపు లైన్లు , ఆరోగ్య కేంద్రాలు దెబ్బతింటున్నవి. రూరల్ మండలం లో పంటలు ముంపుకు గురవుతాయి. ఉదాహరణకు 2024 సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బస్ట్ తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరద ముంపుతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ. 757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.















