19.09.2025 ఖమ్మం, ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి నిత్య కైంకర్యాలు ఆచార వ్యవహారాలలో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అయ్యప్ప స్వామి పై భక్తుల విశ్వాసాన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దని అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ ఏ బి ఏ పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టి వి పుల్లంరాజు శుక్రవారం కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సంబంధిత కార్యకలాపాలన్నీ అనవసర రాజకీయ జోక్యంతో కొనసాగుతున్నాయని ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి సమాజాన్ని భక్తులను ఆందోళనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీ శనివారం శబరిమల పంబ వద్ద అగోలా అయ్యప్ప సంగమం నిర్వహించడాన్ని స్వాగతించారు.
ట్రావెన్కోర్ దేవశ్వం బోర్డు 75 వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి ఏబీఏపీ కృషి చేస్తుందన్నారు. ఈ సంగమం నిర్ణయంతో అయ్యప్ప భక్త సమాజం మొత్తాన్ని ఒకే చోట చేర్చి భక్తుల అభిప్రాయాలను ఫిర్యాదులను విని వారి ఆకాంక్షలను చర్చించి నెరవేర్చడానికి ఒక వేదికగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ట్రావన్ కోర్ దేవస్వం ట్రస్ట్ బోర్డు ఆధ్యాత్మిక సేవా సంస్థలు, ట్రస్ట్ వాటాదారులతో చర్చించి నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వం, దేవస్థానం బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని అభిప్రాయపడ్డారు . ట్రావెన్కోర్ దేవశ్వం బోర్డ్ (టిడిబి )ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించడానికి కేరళ ప్రభుత్వం ,ట్రస్ట్ బోర్డు సభ్యులు , అధికారులు , ఆధ్యాత్మిక సేవా సంఘాలతో కలిపి వేయి మందితో కమిటీ ఏర్పాటు చేశారని ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది డెలిగేట్స్ తో నిర్వహించే ఈ ఆధ్యాత్మిక వేడుకలకు అందిన ఆహ్వానంతో సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలతో అయ్యప్ప భక్త సమాజం కోరుకునే విలువైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలను గౌరవించే విధంగా శబరిమల ఆచార వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా సరైన నిర్ణయాలు తీసుకొనుటకు వేదిక కావాలని ఆకాంక్షించారు.















