యాదగిరిగుట్ట,సెప్టెంబర్ 25 (ఈతరం భారతం);: రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికుల నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు రుసుము పేరుతో, పర్మిషన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం అన్యాయమని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ … బకాయిలు చెల్లించకపోతే యాదగిరి కొండమీదికి ఆటోలను అనుమతించబోమని దేవస్థానం ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. బకాయిలను బేష రతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాత్రికులను కొండపైకి చేర్చే ఆటోలకు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆటో కార్మికుల న్యాయం కోసం పార్టీ పోరాడుతుందన్నారు.
బతుకమ్మపై నిరాదరణ సహించం
తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోని బతుకమ్మను తీసివేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును గుర్తు చేస్తూ అభయ హస్తాన్ని పెట్టడం బతుకమ్మ పండుగకు అన్యాయం చేయడమే అవుతుందని గొంగిడి సునీత అన్నారు. నాటి తమ బిఆర్ఎస్ పాలనలో బతుకమ్మను అధికార పూర్వకంగా నిర్వహించామని.. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ప్రభుత్వు నిధులు కేటాయించి బతుకమ్మ నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశామని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లువేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఆడపడుచు లంతా బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.బీసీ రిజర్వేషన్ల అమలుపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తుందని గొంగిడి సునీత విమర్శించారు. 50% రిజర్వేషన్ల పరిమితి ఉన్నందువల్ల పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావలసి ఉందన్నారు. ఇప్పటి వరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రయత్నం చేయాల్సి వుండిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ముఖ్యంగా ఆడపడుచులు సిద్ధంగా ఉన్నారనీ ఆమె అన్నారు. బతుకమ్మ పండుగలో నిమగ్నం కావలసిన ఆడపడుచులు ఈనాడు యూరియా కోసం క్యూ లైన్ లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మీడియా సమావేశంలో గొంగిడి మహేందర్ రెడ్డి, కర్రె వెంకటయ్య, తోటకూరి బీరయ్య, కసావు శ్రీనివాస్, అంకం నరసింహ తదితరులు పాల్గొన్నారు
.















