యాదాద్రి భువనగిరి అక్టోబర్ 1 (ఈ తరం భారతం );యాదాద్రి జిల్లా నారాయణపూర్, హజారే గడ్డ కాలనీ నివాసి పోలోజు పుల్లయ్య చారి(57) వృత్తి రీత్యా కార్పెంటర్. కొద్ది రోజుల క్రితం పనులు ముగించుకుని ఇంటికి బైక్ మీద తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు తల తో పాటు, శరీరానికి అనేక గాయాలు కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు దగ్గరలోని లైఫ్ కేర్ హాస్పిటల్ లో చేర్పించి, పలు శస్త్ర చికిత్సలు చేయించారు. ప్రస్తుతం ఆయన కోమా లో ఉండి, ఐసీయూ లో వెంటిటేటర్ పై చికిత్స పొందుతున్నారు.పుల్లయ్య కు భార్య, ఒక వివాహిత కుమార్తె, చదువుకుంటున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఆయన ఒక్కరే సంపాదనపరులు. పుల్లయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారణంగా వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. బంధువులు, స్నేహితుల సహకారంతో ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షలు వారి వైద్యానికి ఖర్చు చేశారు. ఆయన కోలుకోవడానికి, చికిత్స కొరకు చాలా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలియ జేశారు.శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ ప్రగతి సంఘం ఎల్బీనగర్ అధ్యక్షులు పోలోజు కంచయ్య చారి మరియు గౌరవ దాత పోలోజు రవీంద్రచారి, సరూర్ నగర్, హైదరాబాద్, వారి ద్వారా ఆర్థిక సహాయం కొరకు పుల్లయ్య చారి కుటుంబ సభ్యులు వెస్సో ట్రస్ట్ ను అభ్యర్థించారు. వెస్సో ట్రస్టీలు పుల్లయ్య చారి కి ఆర్థిక సహాయంగా 40 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ అనుకోని ఆపద తో జీవన్మరణ పోరాటం చేస్తూ, వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడుతున్న, పుల్లయ్య చారి కి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న గౌరవ దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.















