ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 7 :
జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా దేశంలోని, ముఖ్యంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ చరిత్రలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఈ జాతీయ చేనేత దినోత్సవమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో లక్షలాది మంది చేనేత కార్మికులు తమ అసమాన చేతి నైపుణ్యంతో అద్భుతమైన వస్త్రాలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను తయారు చేస్తూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారని కొనియాడారు.
తెలంగాణ నేల చేనేత కళకు నిలయమని, ఇక్కడి నారాయణపేట, కొత్తకోట, గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాలు చేనేతకు ప్రపంచప్రసిద్ధి చెందాయని శ్రీ రాoచందర్ రావు గుర్తుచేశారు. ఈ ప్రాంతాల్లో తయారయ్యే వస్త్రాలు కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ, గుర్తింపు పొందుతుండటం మనందరికీ గర్వకారణమని అన్నారు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన “Vocal for Local – Local to Global” స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ మన భారతీయ చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి చేర్చేందుకు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి, ధరించడం ద్వారా మన చేనేత కుటుంబాల ఉపాధికి కొండంత అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.















